![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-727లో.. ప్లాన్ ఫెయిల్ అయ్యిందని యామినికి రుద్రాణి చెప్పడంతో తను మరో ఐడియా ఇస్తుంది. ఆ కళావతికి.. అత్తయ్యా, మావయ్య, అమ్మమ్మ, తాతయ్యా అంతా ఉన్నారు సరే.. మరి అత్త కొడుకు ఏమయ్యాడనే ప్రశ్నను రాజ్ ముందు పెట్టండి. అప్పుడు రాజ్.. అందరిని నిలదీస్తాడు. ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. రాజ్ తన కొడుకు అన్న నిజం చెప్పలేక, కావ్య తన కోడలు ఎలా అయ్యిందో చెప్పలేక అపర్ణాదేవి గారు తెల్లముఖం వేస్తారంటూ యామిని చెప్తుంది. సూపర్ ఉంది ఐడియా ఇప్పుడే రాజ్తో మాట్లాడతానని రుద్రాణి అతని దగ్గరికి వెళ్తుంది.
రాజ్కి అర్థమయ్యేలా చెప్పాలని రాజ్ ఒంటరిగా దొరికేవరకు కాచుకుని కూర్చుని రాజ్ ఒంటరిగా దొరకగానే రుద్రాణి అడిగేస్తుంది. తప్పుకోండి కళావతి కోసం వెళ్తున్నాను అడ్డు తప్పుకోండి అని రాజ్ అంటాడు. నేను కళావతి గురించే ముఖ్యమైన విషయం చెప్పాలని రుద్రాణి అంటుంది. చెప్పండి అని రాజ్ అనగా.. ఇప్పుడు ధాన్యలక్ష్మి ఉంది.. తనకు ఒక కొడుకు ఉన్నాడు.. పెళ్లి అయ్యింది కాబట్టి కోడలు ఉంది.. అలాగే నేను ఉన్నాను నాకు ఒక కొడుకు ఉన్నాడు.. పెళ్లి అయ్యింది కాబట్టి స్వప్న ఉందంటు రుద్రాణి చెప్తుంటుంది. చూడండి.. మీకు కొంపలు కూల్చే పని తప్ప వేరే పని ఉండదని నాకు ఆల్రెడీ అమ్మ చెప్పింది. మీరు తప్పుకోండి.. గంట తర్వాత తీరిగ్గా చెబుదురుగాని అనేసి రాజ్ వెళ్లిపోతాడు. ఛ మంచి ఛాన్స్ పోయిందని రుద్రాణి బాధపడుతుంటే.. స్వప్న అక్కడికి వస్తుంది. మీరు మారరా.. మా చెల్లెలి విషయం బయటపెడితే మీకేమొస్తుంది అంటుంది. హేయ్ ఏం మాట్లాడుతున్నావని రుద్రాణి ఏం తెలియనట్లుగా నటిస్తుంటే.. మీరు మరీ అంతగా నటించొద్దు.. కావ్య పెళ్లి ఫొటో రాజ్కి ఎందుకు చూపించాలనుకున్నారు.. ఆ ఫొటో ఎందుకు అక్కడ పెట్టారని అంటుంది. అంటే ఆ ఫొటో మార్చింది నువ్వా అని రుద్రాణి అంటుంది. అంటే మీరు ఆ ప్రయత్నం చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా అని స్వప్న అంటుంది. అంటే రాజ్కి గతం గుర్తు చెయ్యాలనుకున్నా అంతే అని రుద్రాణి కవర్ చేసుకుంటుంది. మరోసారి నా చెల్లెలు జోలికి వచ్చినట్లు తెలిసిందో నేను ఊరుకోను చెబుతున్నా.. జాగ్రత్తగా నడుచుకోండి అని రుద్రాణికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది స్వప్న.
ఇక తరువాయి భాగంలో రుద్రాణికి యామినీ కాల్ చేసి.. నేను నా మనుషుల్ని ఆ ఇంటికి పంపిస్తాను.. వాళ్లు జనాభా లెక్కల కోసం వచ్చినట్లుగా అందరి వివరాలు రాజ్ ముందే అడుగుతారు.. అప్పుడు అపర్ణా దేవి కొడుకు భార్య కావ్య అనే విషయం రాజ్ కి తెలిసిపోతుంది కదా అని రుద్రాణీతో క్లారిటీగా మాట్లాడుతుంది యామిని. సీన్ కట్ చేస్తే.. యామినీ మనిషి.. జనాభా లెక్కల సేకరణ వ్యక్తిగా నటిస్తూ ఇంటికి వస్తాడు. అంతా హాల్లోనే ఉంటారు. సుభాష్, ప్రకాశం, అపర్ణా దేవి ఇలా అంతా వారి వారి వివరాలు ఇంట్లో వాళ్ల వివరాలు చెప్తుంటారు. ఈవిడ మీకు ఏం అవుతారంటూ కావ్యని చూపించి అపర్ణా దేవిని అడుగుతాడు యామిని మనిషి. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |